*తొలిసారి రాఖీ ఎవరు ఎవరికి కట్టారు? పురాణాల్లోని ఆసక్తికరమైన కథలు...*
సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీ కట్టి, వారి సుఖసంతోషాలు, ఆరోగ్యం, దీర్ఘాయువును కోరుకుంటారు.అయితే ఈ రాఖీ సంప్రదాయం ఎలా ప్రారంభమైంది? తొలిసారి రాఖీ ఎవరు కట్టారు? దీనిపై పురాణాల్లో ఆసక్తికరమైన కథలు ఉన్నాయి.
*బలిచక్రవర్తికి రాఖీ కట్టిన లక్ష్మీదేవి*
ప్రసిద్ధమైన ఒక కథ లక్ష్మీదేవి, బలి చక్రవర్తికి సంబంధించినది. బలి భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి అతని వద్ద ఉండేందుకు అంగీకరించారని నమ్మకం. విష్ణువు వైకుంఠానికి తిరిగి రాకపోవడంతో లక్ష్మీదేవి ఆందోళన చెందారు. అనంతరం ఆమె సాధారణ స్త్రీ రూపంలో బలి వద్దకు వెళ్లి, అతని మణికట్టుకు రక్షాసూత్రం (రాఖీ) కట్టి సోదరుడిగా చేసుకున్నారని కథనం. దీంతో బలి ఆమె కోరికను గౌరవించి విష్ణువును వైకుంఠానికి పంపించాడని చెబుతారు.
భవిష్య పురాణంలో రక్షాసూత్రం కేవలం సోదరసోదరీమణుల బంధానికే పరిమితం కాదని తెలుస్తుంది. దేవతలు, రాక్షసుల యుద్ధంలో ఇంద్రుడు బలహీనపడినప్పుడు, అతని భార్య శచీదేవి శ్రావణ పౌర్ణమి రోజున పవిత్ర రక్షాసూత్రాన్ని ఇంద్రుడి మణికట్టుకు కట్టిందని కథనం. అనంతరం ఇంద్రుడు విజయం సాధించాడని పురాణ విశ్వాసం.
అలాగే యముడు, యమున కథ కూడా రక్షాబంధన్తో అనుసంధానమై ఉంది. యమున తన సోదరుడైన యముడికి రక్షాసూత్రం కట్టి ఆశీర్వదించగా, సంతోషించిన యముడు ఆమెకు వరం ఇచ్చాడని నమ్మకం. ఈ కారణంగానే రాఖీ కట్టించుకున్న సోదరుడికి దీర్ఘాయువు కలగాలని కోరుకునే సంప్రదాయం ఏర్పడిందని చెబుతారు.
మహాభారతంలో కృష్ణుడు-ద్రౌపది కథ కూడా రక్షణ, ప్రేమకు ప్రతీకగా చెప్పబడుతుంది. కృష్ణుడి వేలికి గాయం కాగా, ద్రౌపది తన చీర కొంగులోని వస్త్రాన్ని చించి కట్టిందని.. దీంతో ఆమెకు కృష్ణుడు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటానని భావించాడని ప్రసిద్ధ నమ్మకం.
August 28, 2026 62